తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దమ్ముంటే ముందుగా బీజేపీ రాష్ట్రాల్లో అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలం బడాభీంగల్, సికింద్రాపూర్, గోనుగొప్పుల, బెజ్జోరా తదితర గ్రామాల్లో రూ.10కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న పెద్దవాగు వంతెన నిర్మాణాలు, బీటీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఇంటింటికీ రక్షిత మంచినీరు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతుంటే చూపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కోరారు. ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలను పెంచి పోషించడం, రెచ్చగొట్టడం తప్ప బీజేపీ నాయకులు చేసిందేమి ఉండదని ఎద్దేవా చేశారు. నిజంగా బండి సంజయ్కి దమ్ముంటే రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చెప్పి తెలంగాణ తరహా పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయించాలన్నారు.