దేశం కోసం, దేశ ప్రగతి కోసం ప్రజలకు ఒక కొత్త ఎజెండాను సెట్ చేయడానికి నేను ఒక సైనికుడిగా పనిచేస్తానని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఎజెండాపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. జాతీయ రాజకీయాలు, వ్యవస్థ, దేశ సమగ్ర స్వరూపానికి సంబంధించిన అంశాలపై మేధావులతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నేటి నుంచి దేశ వ్యాప్తంగా పర్యటనలు చేయనున్నారు. నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాలను సందర్శిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు.
- శుక్రవారం సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారు. వివిధ రాజకీయపార్టీల నేతలతో భేటీ అవుతారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తారు. జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో భేటీ అవుతారు.
- 22 వ తేదీన సీఎం ఛండీగఢ్కు వెళ్తారు. జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీకి చెందిన సుమారు 600 రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెకులను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్తో కలిసి చేపడతారు. సుమారు 4 రోజులపాటు సీఎం కేసీఆర్ చండీగఢ్లో గడుపుతారు.
- 26న సీఎం కేసీఆర్ బెంగళూరులో పర్యటిస్తారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమవుతారు.
- 27న.. బెంగళూరు నుంచి రాలేగావ్ సిద్దికి వెళ్తారు. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ అవుతారు. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకొని..తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు.
- 29 లేదా 30వ తేదీన.. బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్ సంసిద్ధం కానున్నారు. గల్వాన్ లోయలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోనున్నారు.