అత్యాచారం, మోసం, బెదరింపుల కేసులో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఎంపీ అతుల్ కుమార్ సింగ్ ను నిర్దోషిగా స్థానిక కోర్టు ప్రకటించింది. గతేడాది ఆగస్టులో 24 ఏళ్ల మహిళ తన ఫ్రెండ్ తో కలిసి బీజేపీ ఎంపీపై కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో సాక్షి గతేడాది సుప్రీంకోర్టు బయట ఆత్మహత్య చేసుకోవడంతో కాలిన గాయాలతో చనిపోయాడు. ఘోసి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అతుల్ రాయ్ ఈ కేసులో 2019 జూన్ నుంచి జైలులో ఉన్నారు. కాగా, అతుల్ రాయ్కు అనుకూలంగా ఎంపీ,ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సియారాం చౌరాసియా తీర్పు నిచ్చినట్లు ఆయన తరఫు లాయర్ అనూజ్ యాదవ్ తెలిపారు. అతుల్ రాయ్పై ఇతర కేసులు పెండింగ్లో ఉన్నందున ఆయన వెంటనే జైలు నుంచి విడుదల కాలేదు. బాధితురాలి తరఫున ఎలాంటి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించలేదని.. దీంతో నిందితుడిపై కేసు నిరూపణ కాలేదని జస్టిస్ చౌరాసియా తన తీర్పులో తెలిపారు.
సంఘటన వివరాల ప్రకారం.. 2019 మే 1న అతుల్ రాయ్, తదితరులపై అత్యాచారం కేసు నమోదైంది. వారణాసిలోని ఫ్లాట్కు తనను అతుల్ రాయ్ తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని, వీడియోలు, ఫొటోలు తీసి, ఆన్లైన్లో పెడతానంటూ బెదరించాడని పోలీసు ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. దీంతో 2019 జూన్ 22న కోర్టుకు రాయ్ లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన ప్రయాగరాజ్లోని నైని జైలులో ఉంటున్నారు.