అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన వ్యవహారంలో పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ సమీప బంధువు భూపిందర్ సింగ్కు చెందిన ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. రూ.6 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంగళవారం చన్నీ బంధువు భూపిందర్ సింగ్ హనీ నివాసంతో పాటు మరో 10 ప్రాంతాల్లో ఈ సోదాలు చేశారు.
ఈ దాడుల్లో రూ.6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇందులో రూ.4 కోట్లు.. పంజాబ్ సీఎం మేనల్లుడికి సంబంధించిన నివాసంలో గుర్తించినట్లు చెప్పారు. చన్నీ మరదలి కుమారుడైన భూపిందర్ సింగ్ హనీ.. పంజాబ్ రియల్టర్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల కొద్దీ నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే భూపిందర్ నివాసంతో పాటు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.