తెలంగాణలో రేపు(ఆదివారం), ఎల్లుండి(సోమవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ (శనివారం) ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఆవర్తనం ఇవాళ వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని చెప్పింది. ఈ ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.