సికింద్రాబాద్లోని ఓ ఇంట్లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగపోయినా.. ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఇంట్లో ఉడ్ ఫర్నీచర్ ఎక్కువగా ఉండటంతో భారీగా మంటలు వచ్చాయి. ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వడంతో ఘటనాస్థలానికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపుచేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కాగా.. మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బందికి విస్మయానికి గురిచేసే సంఘటన కంటపడింది. ఇంట్లో భారీ మొత్తంలో నగదు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడకు వచ్చి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బంతా హవాలా డబ్బుగా గుర్తించి, ఐటీ అధికారులకు అప్పగించారు. ఇంట్లో లభించిన డబ్బు కోటి 40 లక్షలుగా లెక్కించారు. కేసు నమోదు చేసిన అధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు.