నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుండటంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు ఏం కొనాలన్నా భయపడుతున్నారు. మొన్నటిదాకా కిలో ఉల్లిగడ్డ రూ. 20 ఉండేది. తాజాగా ఆ ధర ఏకంగా రూ. 80కి చేరింది. ఐదు కిలోల ఉల్లిగడ్డ ధర రూ.350కి చేరిందని ఘాజీపూర్ కూరగాయల మార్కెట్లోని ఓ ఉల్లిగడ్డ వ్యాపారి చెప్పారు. నిన్న అది రూ.300లు ఉందని, అంతముందు రోజు రూ.200గా ఉందని.. ఇలా రోజురోజుకు పెరుగుతూ వస్తోందని అన్నారు. గత వారం రోజుల నుంచి ఉల్లిగడ్డ ధరలు పెరుగుతూ వస్తున్నాయని చెప్పారు. ఉల్లిగడ్డ ఉత్పత్తి తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన తెలిపారు.
కాగా.. రానున్న రోజుల్లో ఉల్లిగడ్డల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మరో వ్యాపారి చెప్పారు. నవరాత్రి ఉత్సవాలకు ముందు రూ.50గా ఉన్న కిలో ఉల్లిగడ్డ ధర ఇప్పుడు రూ.70 నుంచి 80 పలుకుతుందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే కిలో ఉల్లిగడ్డ రూ.100కు చేరుతుందని వ్యాపారులు అంటున్నారు. ఉల్లిగడ్డతో పాటు టమాట ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కిలో టమాట రూ.10 నుంచి రూ. 20లు పలికేది. ప్రస్తుతం ఆ ధర రూ.30 నుంచి రూ. 40 పలుకుతోంది. మరోసారి టమాట సామాన్యులకు చుక్కులు చూపిస్తుందేమోనని వినియోగదారులు భయపడుతున్నారు.