కొత్త రేషన్కార్డుల కోసం ఫిబ్రవరి నెలాఖరులో దరఖాస్తులను తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటికే కొత్త రేషన్కార్డుల కోసం ఆరు గ్యారెంటీల దరఖాస్తులతో పాటు విడిగా దరఖాస్తు తీసుకున్నారు. కానీ, వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసింది. గతంలో మాదిరిగానే మీ సేవ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా ప్రత్యేక సాఫ్ట్ వేర్ను రూపొందించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు రేషన్కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది.
రాష్ట్రంలో చాలా మందికి రేషన్కార్డులు లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల వైట్ రేషన్కార్డులు ఉండగా 2.86 కోట్ల మంది లబ్ధిదారులన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 6.5 లక్షల కొత్త రేషన్కార్డులను జారీ చేసింది. దీంతో సుమారు 20 లక్షల మందికి లబ్ధి జరిగింది.
ఇది కూడా చదవండి: కార్ల ప్రియులకు షాక్.. ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న ధరలు..!!