తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవం లో భక్తులు వర్చువల్గా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ టికెట్లను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
రూ.500 చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చన్నారు ఆలయాధికారులు. వర్చువల్ టికెట్లు పొందిన భక్తులకు టికెట్టు పొందిన తేదీ నుంచి 90 రోజుల్లోపు గృహస్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి కల్పిస్తున్నామని, వీరికి ఒక ఉత్తరియం, రవిక, లడ్డూ, వడ బహుమానంగా అందిస్తామన్నారు. దూర ప్రాంతాల నుంచి తిరుచానూరు వచ్చి అమ్మవారి కల్యాణోత్సవంలో పాల్గొన లేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.