Monday, May 20, 2024

‘రైతు బీమా’కు నేటితో ఐదేండ్లు పూర్తి. రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం అందజేత

spot_img

హైదరాబాద్: ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 ఆగస్టు 15న ప్రారంభించిన రైతు బీమా పథకం నేటితో ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. అర్హులైన రైతులందరి తరపున ప్రభుత్వమే ఎల్ఐసికి (LIC)ప్రీమియం చెల్లిస్తూ, ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందిస్తూ బాసటగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని రాష్ట ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.

పథకం ప్రారంభించిన తొలి ఏడాది 2018-19లో 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకోగా,  2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు పెరిగింది.2018 లో రూ.602 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తే, నేడు రూ. 1477 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల తరుపున ప్రభుత్వం రూ. 6861 కోట్లు ప్రీమియం రూపంలో చెల్లించగా, వివిధ కారణాలతో ప్రాణం కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం అందించిందని పేర్కొన్నారు.

గుంట భూమి ఉన్నా చాలు, రైతుగా గుర్తించి, ఆ రైతన్న మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు అందించే అద్భుతమైన రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా లేదు.రైతుల గురించే కాదు, రైతుల కుటుంబాల గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

More Articles