దక్షిణాఫ్రికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జొహన్నెస్బర్గ్లోని ఓ ఐదంతుస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 63 మంది సజీవదహనమయినట్లు తెలుస్తోంది. జొహన్నెస్బర్గ్లోని ప్రముఖ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఓ భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి రాగా.. భవనమంతా దట్టమైన పొగ అలుముకొని సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.
కాగా.. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 52 మృతదేహాలను గుర్తించామని.. మరో 43 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించామని ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు. అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ భవనంలో దాదాపు 200 మంది నివాసముంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రమాదస్థలిలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.