మళ్లీ ఎలక్షన్లు రాంగనే గంటలు పట్టుకొని వస్తరు మేం చేసినం.. ఆరు సందమామలు పెడుతం.. ఏడు సూర్యులను పెడుతం అంటారని సీఎం కేసీఆర్ అన్నారు. కొల్లాపూర్ సింగోటం క్రాస్రోడ్డులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘70 ఏళ్లు ఏడిచిన పాలమూరును పట్టించుకోలేదే. తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? ఇదే కాంగ్రెస్ కాదా? తెలంగాణను ఉద్దరిస్తా.. నేను దత్తత తీసుకున్నానని చెప్పి.. పునాది రాళ్లు పాతింది తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు కాదా? ఎవరైనా సహాయం చేశారా? మనం ఏడ్చిన నాడు.. వలసపోయినాడు.. జిల్లా మొత్తం బొంబాయి బతుకులకు ఆలవాలమైన నాడు.. ఆగమాగమైననాడు ఎవరైనా పట్టించుకున్నాడా? మనం కొట్లాడుకొని.. రాష్ట్రం తెచ్చుకొని ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం. మళ్లీ ఆగమైతే గోసపడుతాం.
ఇక ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టు మంజూరు చేసుకొని.. ఇప్పుడు నీళ్లు చూస్తేంటే నా జన్మ ధన్యమైంది. తెలంగాణ కోసం పార్లమెంట్లో బిల్లు పాసైన రోజు హృదయం పొంగిపోయిందో.. పాలమూరు పంపు ఆన్ చేసిన తర్వాత నా హృదయం పొంగిపోయింది. సంతోషం అనిపించింది. నేను కోరుకున్నది ఇదే. ఆ నాడు ఎవరూ తేలే. మన తెలంగాణలో తెచ్చుకోవాలనుకున్నాం. తెచ్చుకున్నాం. మనకు జాతి, మతం, కులం లేదు. యావత్ తెలంగాణ బిడ్డలు మనోళ్లే. అందరికీ నీళ్లు రావాలి. బాగుపడాలి. రంగారెడ్డి, వికారాబాద్కు కూడా నీళ్లు రావాలి. ఐకమత్యాన్ని కొనసాగించాలి. నీళ్లు వచ్చాయ్ రిజర్వాయర్లు వచ్చాయ్. అందులో వేల టన్నుల చేపలు పండిస్తాం. అవి మత్స్యకారులు, ముదిరాజ్లకే హక్కులు ఇస్తాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.