హైదరాబాద్ : 2009-2013 మధ్య కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో 8,198 మంది రైతులు కరెంట్ షాకులతో చనిపోయారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి వచ్చే కరెంట్ కష్టాలేనని అన్నారు. నిన్న గవర్నర్ ప్రసంగంలో విద్యుత్ రంగం గురించి చాలా అవాస్తవాలు చెప్పారు. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉందన్నారు.
తమ పదేండ్ల పాలనలో పాలమూరులో వలసలు బంద్ అయినాయి. 14 రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి మనదగ్గర వరి నాట్లు వేస్తున్నారు. ఫ్లోరోసిస్ నుంచి నల్లగొండ ప్రజలకు కేసీఆర్ విముక్తి కలిగింది. నేతన్నల ఆత్మహత్యలు బంద్ అయినయ్. నేడు సిరిసిల్ల సిరిశాలగా మారింది. సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించాం. 200 ఉన్న పెన్షన్ను 2 వేలు చేశాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జాతీయ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం గెలుచుకున్నామని స్పష్టం చేశారు.
గత పదేండ్లలో రక్తాన్ని రంగరించినం.. మెదళ్లను కరిగించినం, ప్రాణం పెట్టి పని చేసినం కాబట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో తెలంగాణ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచింది. మా ప్రభుత్వ పనితీరు వల్ల ఐటీఐఆర్ లేకున్నా 2022-23 ఏడాదికి 2 లక్షల 41 వేల కోట్లకు ఐటీ ఎగుమతులకు చేరుకున్నాం. బీజేపీ మోకాలడ్డు పెట్టినా సాధించిన ఘనత మా ప్రభుత్వానిది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఓట్ల కోసం బస్సులు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్లోనే మెగా డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. దాని మీద అతిగతి లేదు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ 40 వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. అక్కడి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ హామీలను నిలబెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు.