నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అందుకు వేదికగా నిలవనుంది. రేపు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ప్రమాణస్వీకారోత్సవానికి దాదాపు 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. ఎన్డీయే కూటమి నేతలు, విపక్ష నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు మోడీ ప్రమాణస్వీకారానికి రానున్నారు.
శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ తదితర దేశాల అధినేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. 2014లో మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో ప్రమాణ స్వీకార వేడుకకు బిమ్స్ టెక్ కూటమి దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సారి సెంట్రల్ విస్టా సముదాయం నిర్మాణ కార్మికులు, వందే భారత్ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందికి, వికసిత్ భారత్ పథకాల అంబాసిడర్లకు కూడా ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది.
మోడీ ప్రమాణం కారణంగా రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి పారా మిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్ పహారాతో భద్రత కల్పిస్తున్నారు.అంతేకాదు..రాష్ట్రపతి భవన్ లోపల, బయట మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. తనిఖీల నిమిత్తం ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. రేపు(ఆదివారం) ఉదయం నుంచి రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఉన్నతాధికారులు.
ఇది కూడా చదవండి:భర్తలను వదిలేసి ఇద్దరు వివాహితలు సహజీవనం