మధ్యప్రదేశ్లో భూ వివాదాలు ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఈ విషాదకర ఘటన మోరెనా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లీపా గ్రామానికి చెందిన ధీర్ సింగ్ తోమర్, గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబాల మధ్య భూ వివాదాలు ఉన్నాయి.
భూమి గొడవల నేపథ్యంలో 2013లో ధీర్ సింగ్ కుటుంబంలోని ఇద్దరిని గజేంద్ర సింగ్ కుటుంబ సభ్యులు చంపారు. ఆ తర్వాత గజేంద్ర సింగ్ కుటుంబం ఊరును వదిలివెళ్లింది. కాగా, ఇటీవలే కోర్టు బయట ఇరు కుటుంబాలు రాజీ కుదుర్చుకున్నాయి.
రాజీ కుదరిన నేపథ్యంలో గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబం సొంతూరుకు వచ్చింది. పక్కా ప్రణాళికతో ధీర్ సింగ్ తోమర్ కుటుంబ సభ్యులు ఇవాళ ఉదయం దాడికి పాల్పడ్డారు. తొలుత కర్రలతో కొట్టి.. అనంతరం తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గజేంద్ర సింగ్, ఆయన ఇద్దరు కుమారులతోపాటు ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి బందోబస్తు ఏర్పాటు చేశారు. గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబ సభ్యులను చంపిన ఘటనలో 8 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.