ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో ఆకతాయిల ఆగడాలకు ఒక విద్యార్థిని బలైంది. సైకిల్పై వెళ్తున్న యువతి చున్నీని ఒక యువకుడు లాగాడు. ఆమె సైకిల్ అదుపుతప్పడంతో రెండు బైకులు విద్యార్ధినిని ఢీకొట్టాయి. తీవ్రంగా గాయపడిన ఆమె చనిపోయింది. వారాహి గ్రామానికి చెందిన 17 ఏండ్ల నైన్సీ పటేల్.. హీరాపూర్ బజార్లోని రాంరాజీ కాలేజీలో ఇంటర్ చదువుతున్నది.
శుక్రవారం కాలేజీ ముగిసిన తర్వాత ఆ విద్యార్థిని సైకిల్పై ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో కొందరు ఆకతాయిలు రెండు బైకులపై ఆ యువతిని వెంబడించారు. ఒక బైక్ వెనుక కూర్చొన యువకుడు నైన్సీ చున్నీ లాగాడు. దీంతో ఆమె సైకిల్ అదుపు తప్పింది. వెనుక వస్తున్న మరో బైక్తో పాటు ఎదురుగా వచ్చిన బైక్ ఆమె సైకిల్ను ఢీకొట్టాయి. దీంతో రోడ్డుపై పడిన ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువతి చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు.
నైన్సీ పటేల్ తల్లిదండ్రుల ఫిర్యాదులో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులైన షావాజ్, అర్బాజ్తో పాటు మరో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.