Sunday, May 19, 2024

డబ్బులిచ్చి మరీ కొట్టించుకుంటున్న జనం.. వీడియో వైరల్‌

spot_img

ఎవరైనా హోటల్ కు వెళ్లి డబ్బులిచ్చి కడుపునిండా తింటారు. కానీ, అక్కడ ఓ హోటల్ కు వెళ్లిన కస్టమర్లు మాత్రం డబ్బులిచ్చి మరీ చెంపదెబ్బలు తిని వస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్‌కు చెందిన ఓ హోటల్‌.. తమ వద్దకు వచ్చే కస్టమర్లకు పుష్టిగా తిండి పెట్టడమే కాదు.. రెండు చెంపలు వాయించే సర్వీస్‌ కూడా తీసుకొచ్చింది. అయితే ఇదేం ఉత్త పుణ్యానికే అనుకుంటే మీరు నూడుల్స్‌లో కాలేసినట్టే. చెంపలు ఎర్రబడేలా వాయించినందుకు కూడా అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు. జనం కూడా ఇదేదో బాగుందని, డబ్బులిచ్చి మరీ చెంపలు ఎర్రబడేదాకా కొట్టించుకుంటున్నారు.

ప్రపంచంలో ఎక్కడైనా రెస్టారెంట్లు అంటే తమ వద్ద తక్కువ ధరకే ఆఫర్లు ఉన్నాయనో, ఇతర హోటల్స్‌తో పోలిస్తే తాము మంచి ఆహారాన్ని అందిస్తామనో ఆఫర్‌ ఇస్తాయి. కానీ జపాన్‌లోని నగోయా నగరంలో ఉన్న సాచిహోకో-యా అనే రెస్టారెంట్‌లో మాత్రం టిఫిన్స్‌, మీల్స్‌, స్నాక్స్‌తో పాటు 300 యెన్‌ (2 డాలర్లు)లు చెల్లిస్తే చెంపదెబ్బలు కూడా లభిస్తాయి. అందమైన అమ్మాయిలు వచ్చి కస్టమర్ల రెండు చెంపలూ వాచేదాకా వాయిస్తారని ఆఫర్‌ ఇచ్చింది. ఒకవేళ కస్టమర్లు తమకు ఆ అందమైన నొప్పి ఇంకా కావాలంటే అందుకు అదనంగా చెల్లించాలట.

అయితే ఇలాంటి ఆఫర్లకు పెద్దగా జనాలు ఏం వస్తారులే..? అనుకుంటే పొరబడ్డట్టే. ఈ ఆఫర్‌ పెట్టాక రెస్టారెంట్‌కు గిరాకీ బాగా పెరిగిందట. అమ్మాయిల హస్త ముద్రల కోసం కస్టమర్లు ఎగబడుతున్నారట. కొంతమందైతే ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ చెంపలు వాయించుకుంటున్నారని హోటల్ సిబ్బంది తెలిపారు. ఎవరైనా చిన్నగా చేయితో తడిమితేనే అగ్గిమీద గుగ్గిల్లమయ్యే జనం.. అమ్మాయిలు అలా కొడుతుంటే మాత్రం తెగ ఎంజాయ్‌ చేస్తున్నారట. పలువురు కస్టమర్లు అయితే తమ బాధలనన్నింటినీ మరిచిపోయి ఈ వాయింపును తెగ ఆస్వాదిస్తున్నారని హోటల్ యాజమాన్యం తెలిపింది.

Latest News

More Articles