పదో పరీక్షలు దగ్గరపడుతున్న వేళ.. ఎస్ఎస్సీ బోర్డు పేరుతో దర్శనమిస్తున్న నకిలీ వెబ్సైట్లు అటు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఎస్ఎస్సీ బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీటితో అసలైన బోర్డు వెబ్సైట్కు ఇబ్బందులు ఉన్నాయని వెంటనే వాటిని తొలగించాలంటూ ఎస్ఎస్సీ బోర్డు అధికారులు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షలను ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో నిర్వహించేందుకు ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. విద్యార్థుల డాటాను www.bse.telangana.gov.in ద్వారా సేకరిస్తున్నది. ఈ వెబ్సైట్ను జిల్లా విద్యాధికారులు, సెకండరీ స్కూల్స్ హెడ్స్ ఆపరేట్ చేస్తుంటారు. ఈ సమయంలో రెండు నకిలీ వెబ్సైట్లని బోర్డు సిబ్బంది గుర్తించి అధికారులకు తెలిపారు. నకిలీ వెబ్సైట్లను వెంటనే తొలగించాలని, ఆయా సైట్ల నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విభాగం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: రిపబ్లిక్ డే వేడుకలకు స్పెషల్ గెస్టులుగా తొలిసారి రైతు దంపతులు
ఎస్ఎస్సీ బోర్డుకు సంబంధించిన కంప్యూటర్ వర్క్ సికింద్రాబాద్లోని మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో బోర్డు అసలైన వెబ్సైట్లను పోలిన bsetelangana. co.in, bsetelanganagov.in నకిలీ వెబ్సైట్లను గుర్తించిన సంస్థ ఈ విషయాన్ని బోర్డు అధికారులకు తెలిపింది.