దేశ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) హవా మొదలైంది. అనేక రాష్ర్టాల రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్సే ప్రధాన చర్చనీయాంశమవుతున్నది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మేధావి వర్గం, యువత, రైతాంగం బీఆర్ఎస్పట్ల అమితాసక్తి చూపుతున్నది. సోదర తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్థాయిలో కూడా బీఆర్ఎస్ ఒక సంచలనంగా మారుతున్నది. విద్యార్థులు బీఆర్ఎస్కు మద్దతుగా ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన శంఖారావం.. దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్ఎస్ సంచలనంగా మారుతున్నది. పార్టీని ఏపీ అంతటా విస్తరించాలని వివిధ వర్గాలు ఇప్పటికే సీఎం కేసీఆర్ను కోరుతున్నాయి. తాజాగా ఏపీకి చెందిన ప్రముఖ నేతలు బీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్బాబు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి సోమవారం హైదరాబాద్లో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
కాగా.. వీరి చేరికతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని, బీఆర్ఎస్ కీలక శక్తిగా ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, అనేకమంది బీఆర్ఎస్ జాతీయ నాయకత్వాన్ని సంప్రదిస్తున్నారని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏపీకి చెందిన విద్యార్థి, యువత, వివిధ రైతు సంఘాల నాయకులు బీఆర్ఎస్కు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున నాయకులు బీఆర్ఎస్లో చేరడానికి ఉత్సాహంగా ఉన్నారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ కీలక శక్తిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అనేకమంది బీఆర్ఎస్లో చేరారు.
తోట చంద్రశేఖర్
బీఆర్ఎస్లో చేరనున్న తోట చంద్రశేఖర్ మహారాష్ట్ర క్యాడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించారు. 2009 లోక్సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. 2.27లక్షల ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5.21లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు.
రావెల కిశోర్ బాబు
ఐఆర్టీఎస్ విశ్రాంత అధికారి ఆయన కిషోర్బాబు, 2014 నుంచి 2018 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2020 నుంచి 2022 వరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగారు.
పార్థసారధి
ఐఆర్ఎస్ అధికారి అయిన పార్థసారధి 2019లో అనకాపల్లి నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. 82 వేల ఓట్లను సాధించారు.