నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఇటీవల 5 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించిన రైల్వే శాఖ.. తాజాగా మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. 9,144 రైల్వే టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 21 ఆర్ఆర్బీల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 8 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఏప్రిల్ 9 నుంచి 18 వరకు సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఈ పోస్టుల్లో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ 1092 పోస్టులు కాగా.. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి. ఏజ్ లిమిట్ జులై 1,2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు. గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, ఎక్స్సర్వీస్మెన్/దివ్యాంగులు.. ఆయా కేటగిరీల వారికి వయో సడలింపు కల్పించారు.
దరఖాస్తు ఫీజు రూ.500. కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసిన తర్వాత రూ.400 రిఫండ్ చేస్తారు. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్మెన్/మహిళలు/థర్డ్ జెండర్/మైనార్టీలు/ఈబీసీలు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష తర్వాత ఈ మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు ఏడో సీపీసీలో లెవెల్-5 కింద ప్రారంభ సాలరీగా రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు లెవెల్-2 కింద ₹19,990 చొప్పున చెల్లిస్తారు.
ఇది కూడా చదవండి: నీట్ దరఖాస్తుల గడువు పొడిగింపు