Friday, May 17, 2024

హోటల్లో కొడుకును చంపి బ్యాగులో కుక్కి శవంతో ప్రయాణించిన తల్లి

spot_img

నవమాసాలు మోసి, కనిపెంచిన కొడుకును ఓ తల్లి కిరాతకంగా చంపేసింది. అనంతరం మృతదేహాన్ని బ్యాగులో పెట్టి, ట్యాక్సీలో ప్రయాణించింది. ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళ.. సామాన్య మహిళ కూడా కాదు. ఆమె ఓ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ విషాద ఘటన గోవాలో జరిగింది.

బెంగళూరుకు చెందిన సుచనా సేత్‌ (39) మైండ్ ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్‌ని స్థాపించి, సీఈవోగా వ్యవహరిస్తోంది. గత శనివారం ఆమె తన నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని ఉత్తర గోవాలోని ఒక హోటల్‌కు వెళ్లింది. సోమవారం ఉదయం అక్కడ గదిని ఖాళీ చేసి ట్యాక్సీలో కర్ణాటకకు బయల్దేరింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ రక్తపు మరకలను గుర్తించారు. హోటల్‌ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. హోటల్‌లో దిగినప్పుడు కుమారుడితో కలిసి కనిపించిన సుచనా.. వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా వెళ్లడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె వెళ్లిన ట్యాక్సీ డ్రైవర్‌కు పోలీసులు ఫోన్‌ చేసి సుచనాతో మాట్లాడారు. అయితే, తన కుమారుడిని ఫ్రెండ్‌ ఇంటి వద్ద వదిలేసినట్లు ఆమె చెప్పింది. సుచనా ఇచ్చిన ఫ్రెండ్‌ అడ్రస్‌ నకిలీదని తేలడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది.

Read Also: ట్రాన్స్‎ఫార్మర్‎ను ఢీ కొట్టిన పెట్రోల్ ట్యాంకర్..

వెంటనే కర్ణాటక పోలీసులకు సమాచారమివ్వడంతో వారు ట్యాక్సీ డ్రైవర్‌ను సంప్రదించి అనుమానం రాకుండా ఆమెను సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాలని సూచించారు. చివరకు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. అయితే సుచనా తన కొడుకును చంపడానికి గల కారణాలు తెలియరాలేదు.

Latest News

More Articles