Saturday, May 18, 2024

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకుండా ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నడు

spot_img

హైదరాబాద్: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకుండా ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నట్టు ఉంది. గడీల పాలన అని గత ప్రభుత్వం మీద ఏడుపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ సీఎం కు లేదు. కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చారు. విజయవంతంగా అమలు చేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. ప్రజా పాలన పేరిట కొత్తగా దరఖాస్తులు చేయాలని కోరడం టైం పాస్ కోసమే అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

‘‘పార్లమెంటు ఎన్నికల దాకా టైం పాస్ చేసి కోడ్ పై నెపం నెట్టే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తుందా అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ గ్యారంటీ లు ఇచ్చినపుడు ఇలాంటి షరతులు ఉంటాయని ఎందుకు చెప్పలేదు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే పథకాలు అనే మాటను అపుడే చెప్పాల్సింది. ఓటర్లను మోసం చేసి అధికారం లోకి రావడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. లంకె బిందెలున్నాయి అని వస్తే ఖాళీ కుండలున్నాయి అని రేవంత్ అంటున్నాడు.

ఎన్నికలప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు అని ఆరోపించారు కదా లంకె బిందెలు ఉన్నాయని ఎలా అనుకుంటున్నారు. ఖజానాలో లంకె బింద ఉండదు రేవంత్ రెడ్డి.తెలంగాణ మొత్తం లంకె బిందనే .నీకు తెలివి తేటలుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చు. అసెంబ్లీలో శ్వేత పత్రాలు పెట్టి అభాసు పాలైంది కాక ప్రధాని ముందు వాటి గురించి చెప్పి తెలంగాణ పరువు తీశారు. అసెంబ్లీలో దేనికి సమాధానం చెప్పక పారిపోయి ఎదో సాధించినట్టు మాట్లాడుతున్నారు.

కేటీఆర్, హరీష్ రావు లే కాదు..జగదీష్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ఆ విషయం ఎందుకు దాస్తావ్. కేసీఆర్ ల్యాండ్ క్రూజర్లు కొన్న విషయం దాచారు అని రేవంత్ చెబుతున్నారు. ఇంతకు ముందు ఇలా కొన్న వారు ఎవరైనా చెప్పారా. దమ్ముంటే ఆ వాహనాలను  రేవంత్ అంబులెన్స్ లుగా మార్చాలి. కేసీఆర్ తన సొంతం కోసం ఏదీ చేసుకొలేదు. దాచుకోలేదు.

కేటీఆర్ మానవతా దృక్పథంతో సాయం చేస్తే దానిపై కూడ నీచంగా మాట్లాడుతున్నారు. పెయింటర్ గా ఉన్న వ్యక్తి ఇన్ని కోట్లకు ఎలా ఎగబాకాడో ఆ విద్యను రేవంత్ చెబితే ఎవరైనా నేర్చుకుంటారు. రేవంత్ తాజా ఎన్నికల అఫిడవిట్ ప్రకారం నెలకు లక్ష రూపాయలు ఇన్కం టాక్స్ కడతారు. రేవంత్ అధికారికంగా చెప్పే ఆస్తులు ఇన్ని ఉన్నాయి అనధికారికంగా ఉన్న ఆస్తులు ఎన్నో. ఇదంతా రేవంత్ రక్తపు కూడేనా. సచివాలయం, ప్రగతి భవన్ దుబారా అని రేవంత్ అంటున్నాడు. సచివాలయాన్ని బీఆర్ అంబెడ్కర్ ఆస్పత్రిగా మారిస్తే మేము స్వాగతిస్తాం. ప్రగతి భవన్ ఉండగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలో క్యాంపు ఆఫీస్ ఎందుకు కట్టుకోవాలనుకుంటున్నాడు.ఇది దుబారా కాదా. ఖజానా ఖాళీ అనే వాడు ప్రజా పాలన పేరిట పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ డబ్బు ఎందుకు దుబారా చేస్తున్నాడు. రేవంత్ వి మాటలే తప్ప చేతలు లేవు. కుక్క తోక వంకర అన్నట్టుగా రేవంత్ సీఎం అయ్యాక కూడా మునుపటి బుద్ది మానుకోవడం లేదు.’’ అని ఫైర్ అయ్యారు.

Latest News

More Articles