Monday, May 20, 2024

పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలకు దెబ్బకొట్టేలా కాంగ్రెస్ కుట్ర

spot_img

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో సోమవారం నిజామాబాద్ లోక్‌సభ స్థానం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఓట్ల వారిగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో మొదటి స్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీల కన్నా బీఆర్ఎస్ ముందు వరుసలో ఉందని తెలిపారు. అయితే ఈసారి జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల ప్రాతినిధ్యం కోసం… గట్టిగా రానున్న ఎన్నికల్లో కొట్లాడితే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించగలం. భారత రాష్ట్ర సమితికి ఎన్నికల్లో గెలుపు ఓటములు కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలుగా ఇచ్చిన హామీల సంఖ్య 6 గ్యారంటీలు కాదు… 420 హామీలు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు హామీలపైన మాట దాటేస్తున్నదని ఆరోపించారు.

అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి భట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పులు, శ్వేత పత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తున్నది. పేద ప్రజల కోసం ఉద్దేశించిన అనే సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నది. ఇప్పటికే నియోజకవర్గానికి 3,000 మందికి ఇచ్చిన గృహ లక్ష్మి లబ్ధిదారుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించింది.  దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయిన తర్వాత దానిపైన స్పందించడం లేదన్నారు.

దళిత బంధు, బిసి బంధు గాని, గృహలక్ష్మి కానీ మరి ఇతర సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేస్తే ఆయా లబ్ధిదారులతో పార్టీ పోరాటం చేస్తుంది. ఇట్లా పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలకు దెబ్బకొట్టేలా కుట్ర చేస్తే పార్టీ తరఫున కొట్లాడుదాం. తమ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు ఎంతమంది రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో వేసామో ప్రజలకి అధికారికంగా వివరించేదని గుర్తుచేశారు.

కానీ రైతుబంధు డబ్బులు వేయకుండా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకువచ్చింది. కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పనితీరును, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు తమ తమ క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.

ఎన్నికల్లో పార్టీ పనితీరు పరంగా కూడా కొన్ని మార్పు చేర్పులు అవసరం వాటిని పార్టీ కార్యకర్తగా ఆకాంక్షలకు అనుగుణంగా కచ్చితంగా మార్చుకుంటాం. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందే. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది గతంలోనైనా ఇప్పుడైనా భవిష్యత్తులో అయినా భారత రాష్ట్ర సమితినే అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Latest News

More Articles