Friday, May 17, 2024

పట్టుబడ్డ డ్రగ్స్ అమ్మేందుకు యత్నించిన ఎస్సై

spot_img

పోలీసుల దాడిలో పట్టుబడిన డ్రగ్స్‎ను అమ్మేందుకు ప్రయత్నించిన ఓ ఎస్సైని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో రాజేందర్‌ ఎస్సైగా పనిచేస్తున్నారు. ఓ కేసుకు సంబంధించి మహారాష్ట్ర ఆపరేషన్ లో పాల్గొన్న ఆయన అక్కడ లభించిన డ్రగ్స్‎లో సుమారు 1,750 గ్రాముల వరకు ఇంట్లో దాచిపెట్టాడు. ఈ విషయంపై నార్కోటిక్‌ విభాగం అధికారులకు పక్కా సమాచారం అందండంతో వారు ఎస్సై రాజేందర్‌ ఇంట్లో సెర్చ్ చేసి డ్రగ్స్‎ను పట్టుకున్నారు. దీనిపై పూర్తి నివేదికను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌, సీపీ సీవీ ఆనంద్‌కు ఇచ్చారు. అనంతరం నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించడంతో వారు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన రాయదుర్గం ఎస్సైగా పనిచేసినప్పుడు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అప్పట్లో అతడిని సర్వీస్‌ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే ఆ ఉత్వర్వులపై రాజేందర్‌ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత సీసీఎస్‌ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్నారు.

Latest News

More Articles