బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తోంది. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీంతో పశుసంవర్ధకశాఖ అధికారులు కోళ్లకు సంబంధించిన శాంపిల్స్ ను భోపాల్లోని టెస్టింగ్ సెంటర్ కు పంపించారు. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీంతో అధికారులు అలర్టయ్యారు. బర్డ్ ఫ్లూతోనే కోళ్లు చనిపోతున్నాయని జిల్లా యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది.
దీంతో కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని, కిలోమీటర్ పరిధిలో ఉన్న చికెన్ షాపులు మూడు నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచించారు. అలాగే.. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ గ్రామాలలో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ కు దూరంగా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంగించి చికెన్ షాపులు తెరిచినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: హై అలర్ట్: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు