ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని నేడు జరిగిన మెదక్ సభలో ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ఇక ధరణిపై కాంగ్రెస్ చేస్తున్న అర్థరహిత విమర్శలపై కేసీఆర్ ఘాటుగా స్పదించారు. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది అని కేసీఆర్ గుర్తు చేశారు. ఎందుకు తీసేస్తారు.. ఏం తప్పు చేసింది అని కేసీఆర్ నిలదీశారు. గతంలో మీ భూముల మీద వీఆర్వో, గిర్దావర్, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, రెవెన్యూ సెక్రటరి, సీసీఎల్ఏ, రెవెన్యూ మినిస్టర్కు కూడా పెత్తనం చేసే అవకాశం ఉండే.
ధరణి వచ్చిన తర్వాత ఈ రోజు గవర్నమెంట్లో ఆఫీసర్లు, మంత్రుల వద్ద ఉండే అధికారాన్ని తీసేసి మీకే అధికారం ఇవ్వడం జరిగింది. మీ భూమిని మార్చాలంటే.. ఎవడు కూడా మార్చలేడు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మార్చలేడు.స్టేట్ ఛీప్ సెక్రటరీ కూడా మార్చలేరు. మీ భూమి యాజమాన్యం.. మీ బొటనవేలితోనే మారుతది తప్ప ఇంకెవడు కూడా మార్చే పరిస్థితి లేదు. ఈ అధికారం రైతుల వద్దనే ఉండాల్నా.. మళ్లీ అధికారులకు అప్పజెప్పాల్నా ఆలోచించాలి. ధరణి పోతే.. పెద్ద పాము మింగినట్టే.. కైలాసం ఆటలో జరిగినట్టే అవుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.