దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉన్నదని చెప్పారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు. దసరా రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.
శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సీఎం అన్నారు. తెలంగాణకు నిత్య విజయాలు కలిగేలా దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని సీఎం కేసీఆర్ దుర్గామాతను ప్రార్థించారు.