హైదరాబాద్ : నగరం నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జై తెలంగాణ అంటూ నినదించారు. అంతకుముందు 12 తుపాకులతో అమరవీరులకు గన్ సెల్యూట్ నిర్వహించారు పోలీసులు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని ప్రారంభించారు సీఎం కేసీఆర్.
రూ. 178 కోట్ల వ్యయంతో మూడున్నర ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 150 అడుగుల ఎత్తులో అమరుల స్మారకాన్ని ప్రమిద, దీపం ఆకృతిలో నిర్మించారు. అమరుల చిహ్నాం నమూనాను కళాకారుడు రమణారెడ్డి రూపొందించారు. అమరుల స్మారక కేంద్రంలో విశాలమైన సభా మందిరంతోపాటు ఉద్యమ ప్రస్థాన చిత్ర ప్రదర్శన కోసం థియేటర్ ను నిర్మించారు.అదే విధంగా ఉద్యమ ప్రస్థానాన్ని వివరించే ఫోటో గ్యాలరీ, ఉద్యమ చరిత్రకు సంబంధించిన గ్రంథాలయం, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధా కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.