తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. సీఎం కేసీఆర్ రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బహిరంగసభలు ఏర్పాటుచేసి ప్రచారం చేస్తున్నారు. ఆయన ఈ రోజు మూడు నియోజగవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.
Read Also: దూకుడు పెంచిన కేటీఆర్.. నేటి నుంచి రోడ్ షోలు
మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 3 గంటలకు ఆసిఫాబాద్లోని ప్రేమల గార్డెన్ ప్రక్కన గల మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు.
సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
కాగజ్ నగర్లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప పరిశీలించారు. ఆసిఫాబాద్లో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవాలక్ష్మి పరిశీలించారు. బెల్లంపల్లిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య పరిశీలించారు. ఈ సభలకు 60 వేల నుంచి 80 వేల వరకు ప్రజలు పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది.