బాన్సువాడ : తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీపుత్రుడు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. అందుకే ఆయన హయాంలో బాన్సువాడ.. బంగారు వాడలా తయారైందని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎక్కడ అడుగుపెట్టినా లక్ష్మీ తాండవించేదని పేర్కొన్నారు. ఎరువులు తేవడం కోసం ఢిల్లీలో వారం వారం రోజులు కూర్చొని కొట్లాడి రాష్ట్రానికి ఎరువులు తెచ్చేవారని చెప్పారు.
Also Read.. నేను ఏది అడిగినా సీఎం కేసీఆర్ కాదనరు
ఈ సభను చూస్తుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష మెజార్టీతో గెలుస్తారనే నమ్మకం కలుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. రాబోయే ప్రభుత్వంలోనూ పోచారం పెద్ద హోదాలో ఉంటారని సీఎం హామీ ఇచ్చారు. ఆ తర్వాత బాన్సువాడకు అన్ని పనులు జరుగుతాయని చెప్పారు. తెలంగాణకు కులం, మతం లేదు. అందరం కలిసి బతికే ప్రాంతం అని కేసీఆర్ స్పష్టం చేశారు.