Saturday, June 22, 2024

వ‌ర్షాల‌పై సీఎస్ స‌మీక్ష‌..అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలని ఆదేశం

spot_img

వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో వానలతో ట్రాఫిక్ జామ్, వరద నీటి నిల్వ వంటి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో నిన్న(శుక్రవారం) ఆమె సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ.. వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.

హైదరాబాద్‌లో దాదాపు 134 ప్రాంతాలను ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించామని సీఎస్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, పోలీస్‌, ఎస్పీడీసీఎల్‌, ఇతర శాఖలు, సంస్థల అధికారులు ఒక కమిటీగా ఏర్పడి నీటి ఎద్దడిని పరిశీలించి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు.  సీటీలో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు భారీ సామర్థ్యంతో ట్యాంకులను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందులో ఇప్పటికే మూడు ట్యాంకుల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

సైబరాబాద్‌లోని రద్దీ ప్రాంతాల్లో వాహనాలు రోడ్లపై సాంకేతిక లోపంతో నిలిచిపోతే వాటిని వెంటనే తొలగించేందుకు అదనపు క్రేన్‌లను సమకూర్చాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిస్తే సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో 630 మాన్ సూన్ సపోర్టు టీమ్ లను అందుబాటులో ఉంచినట్లు దానకిషోర్ తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో డీజీపీ రవిగుప్తా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, వాటర్‌ బోర్డు ఎండీ సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ సీపీలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈసీ శ్రీకారం

Latest News

More Articles