Sunday, May 19, 2024

ఈనెల 26న కోటి మొక్కలు నాటే కార్యక్రమం

spot_img

హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా చేపడుతున్న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈనెల 26న చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం ఆగస్టు 26న రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో ఈ కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంఘాలు, సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలని సి.ఎస్ కలెక్టర్లకు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  తెలంగాణాకు హరితహారం, దశాబ్ది సంపద వనాలు, స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్బంగా కోటి మొక్కలు నాటడం, గొర్రెల పంపిణి, బీసీ, మైనారిటీలకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం, గృహలక్ష్మి, దళిత బంధు, భూ పట్టాల పంపిణి, సామాజిక భద్రతా పింఛనులు, కారుణ్య నియామకాలు, నోటరీ భూముల క్రమబద్దీకరణ, వీఆర్ఓ ల క్రమబద్దీకరణ తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు.

జూనియర్ పంచాయితీ కార్యదర్శుల క్రమబద్దీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా,  రాష్ట్రంలో వివిధ జిల్లాలో 1266 మందికి కారుణ్య నియామకాలను చేపట్టేందుకై సూపర్ న్యూమరరీ  పోస్టులను మంజూరు చేసినందున, ఈ నియామకాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎంతోకాలంగా ప్రజలు కోరుతున్న నోటరీ స్థలాల క్రమబద్దీకరణకై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన మేరకు జీ.ఓ. 84 ను విడుదల చేయడం జరిగిందని, ఈ పథకానికి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన విచారించి క్రమబద్దీకరణ చేయాలనీ ఆదేశించారు.  జీ.ఓ 59 క్రింద ఇప్పటికీ నోటీసులు అందుకున్న వారి నుండి రెగ్యులరైజేషన్ కు నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Latest News

More Articles