చైనాపై బౌద్ధ గురువు, ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాలో బౌద్ధాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే.. ఈ ప్రయత్నంలో చైనా విజయం సాధించదని అన్నారు. బౌద్ధమతాన్ని చైనా విషపూరితంగా పరిగణిస్తోందన్నారు. దాని సంస్థలను నాశనం చేయడం ద్వారా చైనా సంస్కృతిని నాశనం చేయడానికి ప్రచారం చేస్తోందన్నారు.
అంతేకాదు…చైనా ప్రభుత్వం అనేక బౌద్ధ విహారాలను నాశనం చేసినప్పటికీ, దేశంలో బౌద్ధమతాన్ని అనుసరించే వారి సంఖ్య తగ్గలేదన్నారు దలైలామా. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత బీహార్లోని బోద్గయాకు వార్షిక సందర్శనకు దలైలామా వచ్చారు. దలైలామా నేతృత్వంలో జరిగిన బోధనా కార్యక్రమానికి అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ సహా 80 వేల మందికి పైగా బౌద్ధ భక్తులు హాజరయ్యారు.