దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైసీపీ, బీజేడీ మద్దతు తెలుపడంతో పెద్దల సభలో ఈ బిల్లు గట్టెక్కింది. బిల్లుకు అనుకూలంగా 131 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 102 మంది ఓటు వేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలుపడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది బ్లాక్డే అని పేర్కొన్నారు.
ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలను కేంద్రం దొడ్డిదారిన లాగేసుకుందని దుయ్యబట్టారు. ఇది ఢిల్లీ ప్రజలను అవమానించడమేనన్నారు. వచ్చే ఏడాది జరుగబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఢిల్లీ ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వబోరని స్పష్టంచేశారు. తనతో, తన ప్రభుత్వం చేస్తున్న పనితో పోటీపడలేక కేంద్రం ఢిల్లీ ప్రజలను టార్చర్ చేస్తున్నదని ఆరోపించారు. ఇక పార్లమెంట్లోని డీఎంకే కార్యాలయంలో కరుణానిధి చిత్రపటానికి బీఆర్ఎస్ ఎంపీలు నివాళులర్పించారు. సీఎంగా కరుణానిధి తమిళనాడుకు ప్రజారంజక పాలనను అందించారని కొనియాడారు.