నల్గొండ జిల్లా: వరుసగా మూడో రోజు దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. వేదికపైనే కాంగ్రెస్ నాయకులు బాలునాయక్, కిషన్ నాయక్ మైకులు లాక్కుంటూ గొడవ పడ్డారు. వేదికపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పక్కనే ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం గమనార్హం.
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా ఫైలాన్ ఆవిష్కరణ సభను నిర్వహించారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ నేత బాలునాయక్ మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ టిక్కెట్ ను ఆశిస్తున్న మరో నేత కిషన్ నాయక్ బాహాబాహికి దిగారు.
బాలు నాయక్ మాట్లాడుతున్న క్రమంలో కిషన్ నాయక్ మైక్ లాక్కొని ఘర్షణకు దిగారు. దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు బాలునాయక్, రవి నాయక్, కిషన్ నాయక్, బిల్యా నాయక్, రవినాయక్ వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నాయకుల తీరుతో భట్టి అవాక్కయి.. నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.