Sunday, May 19, 2024

చాలామంది స్మార్ట్‌ఫోన్‌ దేనికోసం వాడుతున్నారో తెలుసా?

spot_img

ప్రస్తుత సాంకేతిక యుగంలో చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేని వారు లేరు. పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్‎తోనే.. ఫోన్‎లోనే అన్నీ. మనిషి నిత్య జీవితంలో అంత కీలకమైపోయింది స్మార్ట్‌ఫోన్‌. స్మార్ట్‌ఫోన్‌ ఉండటంతో చాలామంది చాలా పనులు ఇంట్లో నుంచే సులువుగా ఆన్‌లైన్‌లో చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. విరామం దొరికితే చాలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్టర్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికలలో అప్ డేట్ చేయడంతో పాటు, వీడియోలు, సినిమాలు, గేమ్స్ ఆడటం వంటివి చేస్తున్నారు. అయితే.. ఇటీవల ఒక ప్రముఖ పరిశోధన సంస్థ స్మార్ట్‌ఫోన్‌ వాడకంపై ఓ రిపోర్ట్‎ను రిలీజ్ చేసింది. అందులో ఇండియన్స్ తమ స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా ఎందుకోసం ఉపయోగిస్తున్నారనే అంశాన్ని పరిశోధించి ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది.

ఈ నివేదికలో.. 86 శాతం మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా యుటిలిటీ పేమెంట్స్ చేస్తున్నట్లు చెప్పింది. అంటే కరెంట్‌ బిల్లులు, డిష్‌ బిల్లులు వంటివి. ఇది చాలా మంచి పద్ధతి దీనివల్ల టైం ఆదా అవుతుంది. అలాగే సుమారు 80.8శాతం మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఆన్‌లైన్ షాపింగ్.. 61.8శాతం మంది ప్రజలు నిత్యావసర వస్తువులను ఆర్డర్ చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా 66.2శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఆన్‌లైన్ సేవలని బుక్ చేసుకుంటున్నారు. దాదాపు 73.2 శాతం మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి కిరాణా వస్తువులను ఆర్డర్ చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే 58.3 శాతం మంది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి డిజిటల్ నగదు చెల్లింపులు చేస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొంది.

అదేవిధంగా స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే పురుషుల సంఖ్య మహిళల కంటే ఎక్కువగా ఉందని బహిర్గతమైంది. 62 శాతం మంది పురుషులు స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తుండగా.. కేవలం 38 శాతం మంది స్త్రీలు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారని వెల్లడించింది. అలాగే.. పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య కూడా స్మార్ట్‌ఫోన్‌ వాడకంలో తేడా ఉన్నట్లు తేలింది. పట్టణ ప్రజలు 58 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌లను వాడుతుంటే.. గ్రామీణ ప్రజలు 41 శాతం మంది మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు.

Latest News

More Articles