తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో సరైన పేపర్లు చూపించినా.. చిన్న చిన్న కారణాలు చెప్పి సొత్తును పోలీసులు సీజ్ చేస్తున్నారని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 140 కోట్లకు పైగా నగదును సీజ్ చేశారు. వాస్తవానికి ఇందులో అధిక శాతం నగదు సామాన్యులదే. ఏ మాత్రం రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు స్వంత అవసరాలకు,ఇతర ఖర్చులకు నగదుతీసుకు వెళుతున్న సందర్భంలో ఆ నగదును పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు సొత్తు నిబంధనల ప్రకారం ఉంటే తిరిగి తీసుకెళ్లవచ్చని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న నగదులో ఎన్నికలకు, రాజకీయ పార్టీలకు సంబంధం లేదనుకుంటే ఆ యజమానులకు వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సొమ్ము తిరిగివ్వడంలో తీవ్ర ఆలస్యం జరుగుతున్నట్లు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఎలక్షన్ కమిషన్ సీనియర్ డిప్యూటీ కమిషనర్ నీతీష్ కుమార్ వ్యాస్ చెప్పారు. త్వరలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న దృష్ట్యా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఎక్కడా రాజీపడవద్దని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Breaking : టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్