మీకు ఓటు హక్కు లేదా ? ఓటర్ కార్డులో తప్పులున్నాయా ? అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారా ? ఇలాంటి వాళ్ల కోసమే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 6వ తేదీనుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొంది.
ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పొప్పుల సవరణ, చిరునామాల మార్పు తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు ఈ సందర్భంగా స్వీకరించనున్నారు. 2024 జనవరి ఒకటవ తేదీలోగా 18 సంవత్సరాలు నిండినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి ఆరున ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి అదే రోజునుంచి 22వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి రెండవ తేదీవరకు పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 6లోగా డేటాబేస్లో అప్డేట్ చేసినతరువాత ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రచురిస్తారు.