వారిద్దరూ లవ్ చేసుకున్నారు. కొన్నేండ్ల తర్వాత విడిపోయారు. దాంతో ఆ యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయినా ప్రేమికుడిని మరచిపోలేక.. అతడిని కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నై వేళచ్చేరికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు పార్తిబన్, రాణిపేటకు చెందిన సౌందర్య కాలేజీలో చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారు. కాగా.. గత నెల 5న పార్తిబన్ ఐటీ ఉద్యోగం చేసే యువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సౌందర్య.. పార్తిబన్ను మర్చిపోలేనని, అతన్నే వివాహం చేసుకుంటానని తన తల్లి, బంధువులతో చెప్పింది. దాంతో ఆమె తల్లి ఉమ, బంధువులు రమేష్, శివకుమార్లు యువకుడి కిడ్నాప్నకు ప్లాన్ వేశారు. శుక్రవారం ఎప్పటిలాగానే ఆఫీసుకు బయలుదేరిన పార్తిబన్ని కారులో వచ్చి ఎత్తుకుపోయారు. నేరుగా కాంచీపురంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి సౌందర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. కిడ్నాప్ విషయంపై యువకుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలిలోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. మాజీ ప్రియురాలు సౌందర్య, ఆమె తల్లి, బంధువులను అదుపులోకి తీసుకున్నారు.