తెలుగు సినీ నిర్మాత గుండెపోటుతో ఆస్పత్రిలో చేరాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది స్వతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడి పై సినిమా తీశాడు నిర్మాత విజయ్ జాగర్లమూడి. అయితే ఆ సినిమాను విడుదల చేయలేక, ఆర్థిక భారాన్ని తట్టుకోలేక గుండెపోటుకు లోనయ్యాడు.
స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి ఖుదీరామ్ బోస్. బయోపిక్స్ ట్రెండ్లో పాన్ ఇండియా మూవీగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. 2022 డిసెంబర్ 22న ‘ఖుదీరామ్ బోస్’ చిత్రాన్ని గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులకు ప్రదర్శించారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా మాత్రం విడుదల కాలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల వత్తిడితో నిర్మాత విజయ్ జాగర్లమూడి గుండెపోటుకు గురయ్యాడు.