కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతును నొక్కిందంటూ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మూడు నిమిషాల్లో మూడు సార్లు మైక్ కట్ చేశారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసిందని చెప్పారు. నిరసనకు కూడా అవకాశం ఇవ్వట్లేదని అన్నారు. ఎంఐఎం, బీజేపీకి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం భయపడిందని చెప్పారు.అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు చెప్పారని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. కాంగ్రెస్ తప్పులు బయటపెడతామని ప్రభుత్వం భయపడిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావును అవమానించిందని అన్నారు.
తెలంగాణ బిడ్డ టంగుటూరు అంజయ్యను కూడా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అవమానించారని హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. అనేక ఉద్యమకారుల కేసులను బీఆర్ఎస్ సర్కారు మాఫీ చేసిందని చెప్పారు. వ్యవసాయ వృద్ధి రేటులో తెలంగాణ అభివృద్ధి సాధించిందంటే ఆ ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మిరప పంటలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని అన్నారు.