Monday, May 20, 2024

కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తోంది

spot_img

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తోందని విమ‌ర్శించారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజ‌న్ రెడ్డి…బీఆర్ఎస్, కేసీఆర్ మీద బురదజల్లిన బీజేపీ కాంగ్రెస్‌ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

ఉచిత బస్సు తప్ప 72 రోజులలో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలు, హామీలకు పరిష్కారం లేదు.. ప్రత్యామ్నాయం లేదు. గత ప్రభుత్వం ఏం చేసింది..? అంతకన్నా ఏం మెరుగ్గా చేస్తాం అన్నది ప్రభుత్వం చెప్పకపోవడం విచారకరం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్‌లో సరిపడా కేటాయింపులు లేవు. 72 రోజులలోనే గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా తేల్చిచెప్పిందని నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనను తప్పుపట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు నిరంజన్ రెడ్డి. హరీష్ రావు జవాబులకు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయారు. అందుకే అసెంబ్లీలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. సాంప్రదాయాలకు భిన్నంగా ఇరిగేషన్ చర్చకు ఇతర శాఖల మంత్రులు స్పందించడం దారుణమన్నారు.

15 నెలల కిందట హిమాచల్, 8 మాసాల క్రితం కర్ణాటకలో, 72 రోజుల క్రితం 10, 5, 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి కరెంటు కోతలు మొదలయ్యాయని చెప్పారు. మూడెకరాలకు మించి రైతుబంధు ఇంత వరకూ ఇవ్వలేదు. రైతుభరోసా అమలు చేస్తారా ? చేయరా ? ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.15 వేలు ఇవ్వడం మీద ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాళేశ్వరంపై అత్యన్నతస్థాయిలో విచారణ జరిపించండి .. ప్రభుత్వం మీ చేతిలోనే ఉన్నది .. ఏ చర్యకైనా, విచారణకైనా బీఆర్ఎస్ సిద్ధం. బీఆర్ఎస్ మీద కక్ష్యతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయవద్దు. కాళేశ్వరం కింద ఉన్న రిజర్వాయర్లు, టన్నెళ్లను వాడుకునేందుకు అవకాశం ఉంది. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ల సరఫరా విషయంలో స్పష్టత లేదు. పేర్లు మారుస్తారా ? ఏం చేస్తరో ప్రజలకు అందాల్సినవి అందేలా చూడండి. ఆలేరు మెడికల్ కళాశాల కొడంగల్ కు తరలించడం పద్దతికాదు. చేతనైతే కొత్త మెడికల్ కళాశాల కొడంగల్ లో పెట్టాలి. వెనకబడ్డ కొడంగల్ అభివృద్దిని మేము ఖచ్చితంగా హర్షిస్తాం. వనపర్తి రాజులు కట్టిన సరళాసాగర్ ప్రాజెక్టు నిజాం రాజులు కట్టారని నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు. శబరి నదికి తెలంగాణకు, కాళేశ్వరానికి అస్సలు సంబంధం లేదు. తెలంగాణ ప్రతి ఇంచు మీద కేసీఆర్ కు అవగాహన ఉంది.. అందుకే గత పదేళ్లలో తెలంగాణను అభివృద్ది చేశారు. గ్యారంటీల అమలు మీద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలి. వరి ధాన్యానికి రూ.500 బోనస్ విషయంలో మాటతప్పితే విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు నిరంజన్ రెడ్డి.

ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ

Latest News

More Articles