ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాలో ముగ్గురు సీనియర్ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, సత్తుపల్లి కేంద్రంగానే పనిచేస్తానన్నారు. నిరంతరం సత్తుపల్లి ప్రజలతోనే తన ప్రయాణం కొనసాగుతుందన్నారు. అభివృద్ధి చేసిన పనులన్నీ ఎప్పుడు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు తాము ఎలా అందించామో.. కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం కూడా అలాగే అందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
90 వేల మందికి పైగా తనకు ఓటు వేసారని, వాళ్లందరికీ నిరంతరం అందుబాటులోనే ఉంటానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తుపల్లి కేంద్రం గానే పని చేస్తాను. ఎన్నికల్లో నాకు సహకరించిన నాయకులకు కార్యకర్తలు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసారు.