రెండవ స్పెషల్ సమ్మరీ రివిజన్ లో భాగంగా అర్హులైన వారందరూ ఓటరు నమోదు చేసుకోవాలన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. ఇందుకోసం సెప్టెంబర్ 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు పోలింగ్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
స్వచ్ఛమైన, పటిష్టమైన ఓటరు జాబితా తయారీ లో భాగంగా 18 ఏండ్లు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటరు జాబితా పేరు లేని వారితో పాటు అక్టోబర్ 1, 2023 నాటికి 18 ఏండ్ల వయస్సు నిండబోయే వారు ముందస్తుగా నమోదు చేసుకోవచ్చు. 21-08-2023 న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగా పరిశీలన చేసుకోవాలి. పేరులో ఏదైనా తప్పులు ఉన్నచో సవరించుకునే అవకాశం ఉంది. ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా మీ బూత్ లెవెల్ అధికారి పోలింగ్ స్టేషన్ లో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని తెలిపారు కమిషనర్ రోనాల్డ్ రోస్.
ఓటరు జాబితాలో చెక్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ceotelangana.nic.in లో కూడా పరిశీలన చేసుకోవచ్చన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. నూతన ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా, ఆధార్ అనుసంధానం కు ఫారం-6B, ఓటరు జాబితా అభ్యంతరాలు, ఓటరు తొలగింపు కు ఫారం-7, మార్పులు చేర్పులకు ఫారం-8 ద్వారా సెప్టెంబర్ 19, 2023 వరకు నమోదు చేసుకోవచ్చన్నారు.
ఓటరు జాబితాలో మొబైల్ నెంబర్ అప్డేషన్, అక్షర దోషాలు, ఇంటి నెంబర్, అడ్రస్ మార్పు, మిస్ మ్యాచ్ ఫొటోలు, ఫొటో స్థానంలో ఏదైనా ఇతర సర్టిఫికెట్ లు, ఫొటో తల క్రిందులుగా ఉండడం, ఒకే కుటుంబ సభ్యుల పేర్లు అదే నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ స్టేషన్ లో ఉండడం. ప్రామాణికంగా లేని ఇంటి నెంబర్ లో నమోదు, సొంత నియోజకవర్గంలో కాకుండా ఇతర నియోజకవర్గంలో ఓటరు జాబితాలో నమోదు కావడం లాంటి తప్పులున్నప్పుడు మార్పులు, చేర్పులు ఫారం-8 ద్వారా నమోదు చేసుకొనవచ్చును. మార్పులు, చేర్పులకు, ఓటరు నమోదు తో పాటు ఓటరు జాబితా చెకింగ్ కొరకు ఈసీఐ వెబ్ సైట్ https://voters.eci.gov.in గానీ voter helpline app ను డౌన్ లోడ్ చేసుకొని సవరణ చేసుకోవాలని తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.