గ్రేటర్ హైదరాబాద్లో మళ్లీ ఎన్నికల సందడి రానుంది. 150 డివిజన్లలోని గుడిమల్కాపూర్, శాస్త్రీపురం, మెహిదీపట్నం డివిజన్లకు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ అనుమతికిగానూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసేందుకు జీహెచ్ఎంసీ సెక్రటరీ, ఎన్నికల విభాగం కసరత్తు చేస్తున్నది.
Read also: సీఎం, మంత్రులకు సిగ్గులేదు..! కేరళ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ ఏడాది జనవరిలో గుడిమల్కాపూర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ మృతి చెందారు. దీంతో పాటు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరపున ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. శాస్త్రీపురం డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ ముబీన్, మెహిదీపట్నం కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్లు కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. దీంతో ఖాళీ అయిన ఈ మూడు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకుగానూ జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతున్నది. ఎన్నికల సంఘం అనుమతి మేరకు ఈ డివిజన్లలో ఎన్నికలను నిర్వహించనున్నారు.