బీఎస్సీ నర్సింగ్ కోర్సులో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. నీట్ హాజరు తప్పనిసరి నిబంధన నుంచి సడలింపు ఇచ్చింది. ఈఏపీ సెట్ (ఎంసెట్) హాజరైనా, మెరిట్ ఆధారంగా అయినా సీట్లు భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ సడలింపు 2023-24 అకాడమిక్ ఇయర్ కు మాత్రమే వర్తించనున్నట్టు ఆమె ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అవసరమైతే మేనేజ్మెంట్ కోటాతో పాటు కన్వీనర్ కోటాకు కూడా ఇదే నిబంధనను వర్తింపజేయవచ్చని చెప్పారు. మెరిట్, ఈపీసెట్, నీట్ ఈ మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో హెల్త్ యూనివర్సిటీదే తుది నిర్ణయమని తెలిపారు.
బీఎస్సీ నర్సింగ్ చదవాలంటే కచ్చితంగా నీట్ రాయాల్సిందేనన్న నిబంధనతో అటు విద్యార్థులు, ఇటు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నష్టపోతున్నాయి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సూచనల మేరకు కన్వీనర్ కోటాకు ఎంసెట్ను ప్రామాణికంగా వర్తింపజేయగా, మేనేజ్మెంట్ కోటాకు మాత్రం ఇంకా నీట్ తప్పనిసరి అనే నిబంధన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్, కన్వీనర్ కోటా సీట్లు భర్తీ కావడం లేదు. దాదాపు రెండు వేలకు పైగా సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఈ అంశంపై విద్యార్థులు, వారితల్లిదండ్రులు, ప్రైవేటు నర్సింగ్ కాలేజీల యాజమాన్యం నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. నీట్ తో పాటు ఎంసెట్ ర్యాంకు, మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు జరిపేలా అవకాశం కల్పించాలని కోరారు. వీటిని పరిశీలించిన తర్వాత సడలింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేత వికృత చేష్టలు.. కోరిక తీర్చాలంటూ వివాహితపై వేధింపులు