హైదరాబాద్: 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనున్నది. గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది.
ఈ నేపథ్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న 1,995 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్, పరీక్షల విభాగం ప్రత్యేకాధికారి బీఎల్ సంతోష్ సమావేశం నిర్వహించి ఏర్పట్లపై సమీక్షించారు.
503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2022 అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 3,80,032 మందిని పరీక్షలకు అనుమతించినా.. శుక్రవారం అర్ధరాత్రి వరకు 2,85,000 మంది మాత్రమే హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకొన్నారు.
పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. అభ్యర్థులు బూట్లు వేసుకుని పరీక్షకు రాకూడదని, చెప్పులు మాత్రమే ధరించాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.
హాల్టికెట్లో ఫొటో విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 3 పాస్పోర్టు సైజ్ ఫొటోలను గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలని టీఎస్పీఎస్సీ సూచించింది.