Friday, May 17, 2024

దేశంలోనే అత్యున్నత పోలీస్ శాఖగా తెలంగాణ పోలీస్

spot_img

తెలంగాణ పోలీస్ శాఖ.. దేశంలోనే అత్యున్నత శాఖ అని తెలిపారు రాష్ట్రం హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ 281 మంది పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సేవా పతకాలను ఇవాళ(బుధవారం) రవీంద్ర భారతిలో ప్రదానం చేశారు. కొత్త పోలీస్‌ జోన్ల ఏర్పాటు, డివిజన్లు, స్టేషన్లు కొత్తగా ఏర్పాటుతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం, ఐ4సీలను కూడా ఏర్పాటు చేశామన్నారు హోంమంత్రి మహమూద్‌ అలీ. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ టవర్‌ను ప్రారంభించుకున్నామన్నారు. రాష్ట్రంలో మెరుగైన శాంతియుత పరిస్థితులు ఉన్నందునే, అనేక బహుళ జాతి సంస్థలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాయన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, మహిళా భద్రతా విభాగం, షీ టీమ్స్‌, భరోసా కేంద్రాలు, సీసీ టీవీల ఏర్పాటు, మట్కా-గ్యాంబ్లిగ్ కేంద్రాల మూసివేత, మాదక ద్రవ్యాల నివారణ తదితర చర్యలతో తెలంగాణ పోలీస్ దేశంలోనే అత్యున్నత పోలీస్‌ శాఖగా నిలిచిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్‌శాఖ ఆధునీకరణ, పెద్ద ఎత్తున నియామకాలకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారన్నారు హోంమంత్రి మహమూద్‌ అలీ.

పతకాలు కేవలం వ్యక్తిగతం కావని, తమ పరిధిలో పనిచే వారందరితో పాటు, కుటుంబ సభ్యులకు వచ్చినట్టుగా భావించాలన్నారు డీజీపీ అంజనీ కుమార్. పోలీస్‌శాఖ ఆర్థికాభివృద్ధిలో కీలకమైన ఓ ప్రధాన భాగమన్నారు. పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాములాంటిదని.. నిరంతరం ప్రజాసేవలో విధులు నిర్వర్తించే పోలీసులు తాము అందించే ఉత్తమ సేవలకు గుర్తింపుగా సేవా పతకాలను అందచేయడం జరుగుతోందన్నారు. ఈ పతకాల స్ఫూర్తితో మరింత అంకితభావంతో పనిచేయాలని పోలీసు అధికారులకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్‌శాఖకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు.

Latest News

More Articles