ఇస్లామాబాద్: ఇప్పటికే తోషాఖానా అవినీతి కేసులో మూడేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్.. మరోసారి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) ఆయనను మళ్లీ అరెస్టు చేసే అవకాశం ఉందని ‘డాన్’ పత్రికాకథనం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అటక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ఖాన్ను ఎఫ్ఐఏ గంటకు పైగా విచారించింది.
గతేడాది ఇమ్రాన్ ప్రధానిగా దిగిపోయేముందు నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ఇమ్రాన్ పాల్గొన్నారు. తమ ప్రభుత్వాన్ని దించేందుకు వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదేనంటూ కొన్ని పత్రాలను చూపించారు. అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి ఈ ఆధారాలు సేకరించినట్లుగా అప్పట్లో పేర్కొన్నారు. ఇపుడు రహస్యపత్రాల వెల్లడి కేసు రూపంలో అదే ఇమ్రాన్ మెడకు చుట్టుకుంటోంది.
కాగా, ఆ ర్యాలీలో తాను చూపించింది ఎంబసీ పత్రాలు కావని, అవి కేబినెట్ సమావేశ మినిట్స్గా విచారణ అధికారులకు ఇమ్రాన్ తెలిపినట్లు తెలుస్తోంది. ఇదే కేసుకు సంబంధించి ఇమ్రాన్ఖాన్తోపాటు ఆయన సహచరుడు పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ విదేశాంగ మంత్రి అయిన షా మహమ్మద్ ఖురేషీపై ఎఫ్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆగస్టు 19న ఖురేషీని అధికారులు అరెస్టు చేశారు.