Wednesday, May 22, 2024

గగన్‌యాన్‌తో పాటు ఈ ఏడాది 12 కీలక మిషన్లు

spot_img

న్యూఢిల్లీ: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) 2024 సంవత్సరం తొలిరోజునే ఎక్స్‌పోశాట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది గగన్‌యాన్‌తో పాటు 12 మిషన్లను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు. గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా ఇస్రో 2023లో అబార్ట్‌ మిషన్‌ నిర్వహించిందని, ఈ ఏడాది మరో రెండు అబార్ట్‌ మిషన్లను నిర్వహించనున్నట్లు సోమనాథ్‌ ప్రకటించారు. రెండు మానవరహిత మిషన్లు.. హెలికాప్టర్ డ్రాప్ టెస్ట్, లాంచ్ ప్యాడ్ అబార్ట్ టెస్టులు ఉంటాయన్నారు.

ఈ ఏడాది జీఎస్‌ఎల్‌వీని సైతం ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ తెలిపారు. ఇన్‌శాట్-3డీఎస్, భారత్, యుఎస్ సంయుక్తంగా నిర్మించిన నిసార్, సెకండ్‌ జనరేషన్‌ నావిగేషన్ ఉపగ్రహాలను జీఎస్‌ఎల్‌వీ నింగిలోకి మోసుకెళ్లనుందని వివరించారు. 2024లోనే స్క్రామ్ జెట్ ఇంజిన్ పరీక్ష, రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెస్ట్‌లను సైతం నిర్వహిస్తామన్నారు.

కాగా, ఈరోజు ప్రయోగించిన ఎక్స్‌పోశాట్‌ గురించి సోమనాథ్‌ మాట్లాడుతూ.. ఇది ఓ ప్రత్యేక మిషన్‌ అని పేర్కొన్నారు. దీంతో కృష్ణ బిలాలపై మరింత అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. గతేడాది ప్రయోగించి ఆదిత్య ఎల్‌-1 జనవరి 6న ఎల్‌-1 పాయింట్‌కు చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ చెప్పారు.

Latest News

More Articles